హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు

26 Mar, 2014 19:22 IST|Sakshi
హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు

అదొక ముస్లిం దేశం. ఇస్లాం పేరిట ఏర్పడ్డ దేశం. అయినా అక్కడి ముస్లింలు ఒక మందిరాన్ని కాపాడాలని ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తట్టుతూ, ఉద్యమాలు చేస్తూ ఒక మందిరం కోసం పోరాడుతున్నారు.
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ లోని 150 ఏళ్ల చరిత్రాత్మక శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానికి కొద్ది అడుగుల దూరంలోనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణమౌతోంది. భారీ క్రేన్లు, ఎర్త్ మూవర్లు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. మీటర్లకు మీటర్లు గోతులు తవ్వేస్తున్నాయి. ఈ పనుల వల్ల కలిగే ప్రకంపనలు శ్రీ రత్నేశ్వర మహాదేవుడి గుడికి ప్రమాదంగా పరిణమించాయి.
గుప్పెడు మంది కూడా లేని పాకిస్తానీ హిందువులు గుడి కోసం పోరాడే పరిస్థితిలో లేరు. కానీ కరాచీలోని ముస్లింలు వారికి బాసటగా నిలుస్తున్నారు. పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తసదుక్ హుసేన్ జిలానీ ఈ నిర్మాణం వల్ల మందిరం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు లాహోర్ లో ఉన్న అతి పెద్ద మందిరాల్లో అదొకటి. అక్కడ శివరాత్రి ఉత్సవాలు మహాఘనంగా జరిగేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. కానీ ఆ గతాన్ని ఖతం కానీయబోమంటూ అక్కడి ముస్లింలు ముందుకొస్తున్నారు.

మరిన్ని వార్తలు