సియోల్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గతకొంత కాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం సరిగ్గాలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. కిమ్ ఆరోగ్యం పరిస్థితిపై అమెరికా లాంటి పలు ప్రపంచ దేశాలు సైతం స్పందించాయి. ఆయన గురించి తెలుసుకునేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేశాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా ప్రభుత్వం ఏప్రిల్ 27న దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు మీద ఓ లేఖను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ వెలువడింది. దీనిని స్వయంగా ఉత్తర కొరియా అధినేత పంపిన లేఖ అని ఆ దేశ మీడియా ఓ కథనం ప్రచురించింది. దీంతో కిమ్ క్షేమంగానే ఉన్నారని తెలుస్తోంది. (కిమ్ బతికే ఉన్నాడు!)
కాగా మరోవైపు ఆయన ఆరోగ్య వదంతులను అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. కిమ్ ఆరోగ్యంపై తమకు తమకు క్లారిటీ ఉందని ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నట్లు యూఎస్ తెలిపింది. ఇక దక్షిణ కొరియా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కిమ్ బతికే ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఢోకా లేదని ఆ దేశం అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్ చుంగ్ వెల్లడించారు. కొరియాకు తూర్పు ఉన్నత ప్రాంతంలోని వాన్సన్లో కిమ్ ఏప్రిల్ 13 నుంచి ఉంటున్నట్టు చుంగ్ ఇన్ తెలిపారు. ఇదిలావుండగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని చైనా పేర్కొనడం గమనార్హం. (మా వద్ద ఆ సమాచారం లేదు: చైనా)