Ind vs SA Test: ‘సెంచూరియన్‌’ పేసర్లకు అనుకూలం!

24 Dec, 2023 04:52 IST|Sakshi

తొలి రోజు మ్యాచ్‌కు వాన గండం  

సెంచూరియన్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్టు పేస్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ నెల 26నుంచి మ్యాచ్‌ జరిగే సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌ పిచ్‌ పేసర్లకు బాగా కలిసొస్తుందని పిచ్‌ క్యురేటర్‌ బ్రయాన్‌ బ్లాయ్‌ స్వయంగా వెల్లడించాడు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ టెస్టుకు వాన అంతరాయం కలిగించవచ్చు. మ్యాచ్‌ మొదటి రోజు పూర్తిగా వాన బారిన పడవచ్చని సమాచారం.

ఈ నేపథ్యంలో పిచ్‌పై క్యురేటర్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘మొదటి రోజు గనుక ఆట వాన బారినపడితే తర్వాతి రోజుల్లో పేసర్లకు మంచి అవకాశముంది. పిచ్‌పై కవర్లు ఎక్కువ సమయం ఉంచిన తర్వాత ముందుగా బ్యాటింగ్‌ చేయడం చాలా కఠినంగా మారిపోతుంది. దాదాపు 20 డిగ్రీలకు పడిపోయే చల్లటి వాతావరణంలో పేస్‌ బౌలర్లకే మేలు జరుగుతుంది.  

ఆపై కూడా మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర నామమాత్రంగా మారిపోతుంది. పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక ఉంది. మ్యాచ్‌ సమయానికి కూడా దీనిని కొనసాగిస్తాం. నాలుగు రోజుల్లోనే టెస్టు ముగిసినా ఆశ్చర్యం లేదు’ అని బ్లాయ్‌ వ్యాఖ్యానించాడు. 2021 సిరీస్‌లో సెంచూరియన్‌లోనే జరిగిన టెస్టులో భారత్‌ విజయం సాధించింది.

>
మరిన్ని వార్తలు