అవ్వ చేసిన పొరపాటు.. ఎయిర్‌పోర్టు హడల్‌

9 Apr, 2018 20:21 IST|Sakshi

బ్రిస్బేన్‌ : ముంబైకి చెందిన ఓ బామ్మ చేసిన పొరపాటు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి  వెళ్తే.. ముంబైకి చెందిన వెంకట లక్ష్మి అనే బామ్మ తన పుట్టిన రోజు వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లింది. వెళ్తూ ఓ బ్యాగ్‌లో తన లగేజీని తీసుకెళ్లింది. అసలు సమస్య అక్కడే ప్రారంభం అయ్యింది. ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. అంతే కాకుండా లగేజీ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ బయట పడలేదు. 

కానీ అసలు విషయం ఏంటంటే.. బామ్మ తను తీసుకెళ్లే బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్‌ బదులు 'బాంబ్‌ టూ బ్రిస్బేన్‌' అని రాసుకుంది. అది చూసిన అధికారులు బ్యాగ్‌లో బాంబ్‌ ఉందేమోనన్న అనుమానంతో ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశారు. అనంతరం బామ్మను ప్రత్యేక గదిలో విచారించగా అసలు విషయం ఏంటో తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌పై తగిన ఖాళీ లేకపోవడం వల్ల బాంబే బదులు బాంబ్‌ అని రాసుకున్నానంటూ అధికారులకు తెలిపింది.

ఈ సంఘటనపై బామ్మ కుమార్తె జోతిరాజ్ మాట్లాడుతూ తన తల్లికి ఇంగ్లీష్‌ పూర్తిగా రాదని, చదవడం రాయడం అరకొరగా తెలుసునంటూ అధికారులకు తెలిపింది. అందుచేతనే బ్యాగ్‌పై అలా రాసుకొచ్చిందని, బాంబ్‌ అని రాయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తన తల్లికి తెలియవంటూ అధికారులకు వివరించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు