తీవ్రమైన ఇజ్రాయెల్ దాడులు

11 Jul, 2014 02:03 IST|Sakshi
తీవ్రమైన ఇజ్రాయెల్ దాడులు

 పాలస్తీనాలో 82కి పెరిగిన మృతుల సంఖ్య

గాజా/జెరూసలేం: హమస్ అధీనంలో ఉన్న గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ తీవ్రం చేసింది. గురువారం దాదాపు 780 హమస్ మిలిటెంట్ కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడుల్లో 31 మంది చనిపోయారు. దీంతో ఈ మూడు రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినవారి సంఖ్య 82కి చేరింది. ఫుట్‌బాల్‌వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూస్తుండగా ఒక హోటల్‌పై జరిగిన దాడిలో 9 మంది పాలస్తీనావాసులు మరణించారు.

ఇజ్రాయెల్ చర్యలకు రాకెట్ దాడులతో పాలస్తీనా మిలిటెంట్లు సమాధానమిచ్చారు. దిమోనా అణు రియాక్టర్ లక్ష్యంగా ఇజ్రాయెల్‌పైకి వారు గురువారం 15 రాకెట్లను ప్రయోగించారు. ఖాన్ యూనిస్ పట్టణంలోని ఒక ఇంటిపై చేసిన దాడి దురదృష్టకరమని ఇజ్రాయెల్ సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, దాడులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ దాడిలో ఎనిమిదిమంది చనిపోగా, పాతికమంది వరకు గాయాలపాలయ్యారు.

మరిన్ని వార్తలు