పైలట్కు ఇబ్బందని నలుగురిని దించేశారు

20 Jan, 2016 16:40 IST|Sakshi

న్యూయార్క్:   విమాన సిబ్బందికి నచ్చలేదని నలుగురు ప్రయాణికులను బలవంతంగా  దించివేసిన ఘటన  ఆందోళన రేకెత్తించింది.  ఒక సిక్కు యువకుడు సహా అతని స్నేహితులు నలుగుర్ని  విమానం దిగిపోవాల్సిందిగా అమెరికన్ ఎయిర్ లైన్స్ అదేశించింది.   లేదంటే విమానాన్ని  ఆపివేస్తామన్నారు.   దీంతో వివాదం రాజుకుంది.

ఒక సిక్కు యువకుడు, ముగ్గురు ముస్లిం యువకులతో కలిసి  టొరంటో నుంచి  న్యూయార్క్ వెళ్లేందుకు విమానంలో బయలుదేరారు.    షాన్ ఆనంద్, ఆలం, డబ్ల్యూ.హెచ్, ఎంకె,  ఈ నలుగురు  విమానం ఎక్కి సర్దుకుని  కూర్చొనే లోపే  వారికి చేదు అనుభవం ఎదురైంది.   విమానంనుంచి దిగిపోవాల్సింది విమాన అటెండెంట్ అదేశించింది.  దీంతో షాకైన యువకులు వాదనకు దిగారు.   అయినా ఫలితం దక్కలేదు. చివరికి వారిని బలవంతంగా గెంటేసి మరీ  విమానం ఎగిరిపోయింది.
 
దీనిపై   షాన్ , అతని  స్నేహితులు ఎయిర్ లైన్స్   సంప్రదించినపుడు అధికారులు విచిత్రమైన వాదనకు  తెరతీశారు. వారి ఇంటి పేర్ల ఆధారంగా బంగ్లాదేశ్ ముస్లిం, అరబ్ ముస్లింలను గుర్తించిన విమాన సిబ్బంది ఆందోళనకు  లోనయ్యారని తెలిపారు. ముఖ్యంగా పైలట్ వారు విమానంలో ఉంటే  తమకు అసౌకర్యంగా ఉంటుందని వాదించారన్నారు. అందుకే   ఈ నిర్ణయం తీసుకున్నామని  చెప్పడంతో ఆ యువకులు న్యాయపోరాటానికి  సిద్ధమయ్యారు.  అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై సుమారు 62 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సింది కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

నిబంధనలకు విరుద్ధమంటూ, ప్రోటోకాల్ పేరుతో  ఎయిర్ లైన్స్   సంస్థ తమను మానసికంగా వేధించిందని  ఆనంద్  ఆరోపించాడు.  అందరూ తనను క్రిమినల్గా చూస్తోంటే చాలా బాధేసిందని డబ్ల్యూ.హెచ్   అనే మరోయువకుడు  వాపోయాడు.
 

మరిన్ని వార్తలు