Chandra Mohan Last Words: చంద్రమోహన్‌ చివరి మాటలు.. ఆయన కోసం ఏడ్చేసిన నటుడు

11 Nov, 2023 15:30 IST|Sakshi

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతితో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం(నవంబర్‌ 11న) కన్నుమూశారు. చంద్రమోహన్‌ చివరిసారిగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణించినప్పుడు మీడియా ముందుకు వచ్చారు.

అవే చివరిమాటలు
చంద్రమోహన్‌ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్‌.  ఈ దిగ్గజ దర్శకనటుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. అన్నయ్య మరణం చంద్రమోహన్‌ను ఎంతగానో కుంగదీసింది. విశ్వనాథ్‌ పార్థివదేహం చూసి ఈయన తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కె.విశ్వనాథ్‌.. స్వయానా నా పెదనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నా కజిన్‌. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోని అందరికంటే కూడా నేను చాలా దగ్గరివాడిని. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆయన తన జీవితంలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు అందించారు.

(చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు!.)

25 ఏళ్ల పక్కపక్కనే ఉన్నాం..
విశ్వనాథ్‌ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కుని, ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఆయన నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. 1966లో విశ్వనాథ్‌ దర్శకుడిగా, ఎస్పీ బాలు గాయకుడిగా, నేను నటుడిగా పరిచయమయ్యాం. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు' అని ఎమోషనల్‌ అయ్యారు. కళాతపస్విని తలుచుకుంటూ చంద్రమోహన్‌ మాట్లాడిన మాటలే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో అన్నయ్య గురించి చంద్రమోహన్‌ కంటతడి పెట్టుకున్న వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది.

చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో..
చంద్రమోహన్‌ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్‌ సెలబ్రిటీల నివాళులు

మరిన్ని వార్తలు