దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం

3 Aug, 2018 09:56 IST|Sakshi
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా

కేప్‌టౌన్‌ : దక్షిణాఫ్రికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్రం తర్వాత కూడా దేశంలోని అధిక భూమి తెల్లవారి చేతుల్లోనే ఉంది. తెల్ల రైతుల చేతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు పరిహారంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వకూడదని దక్షిణాఫ్రికా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందుకు ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించాల్సివుంటుంది.

మరోవైపు అత్యధిక భూములు కలిగివున్న తెల్లవారి నుంచి వాటిని లాక్కోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వెనెజులా, జింబాబ్వేల్లా పంట కొరత ఏర్పడి దేశం ఆకలితో అలమటించే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని ఖాతరు చేయకుండా దేశాధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ముందుకు సాగుతున్నారు.

అయితే, రాజకీయ స్వలాభం కోసమే సిరిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సిరిల్‌ తెల్లవారి నుంచి భూములను లాక్కొవాలని నిర్ణయించుకున్నారని ఆరోపిస్తున్నాయి. తెల్లజాతి వారి ప్రభాల్యం కలిగిన ఆఫ్రీ ఫోరం అనే సంస్థ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పెను పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

దక్షిణాఫ్రికాలో సమస్య ఏంటి?
బ్రిటీష్‌ పాలనా కాలంలో 1913లో నేటివ్ ల్యాండ్స్ యాక్ట్‌ పేరుతో దక్షిణాఫ్రికాకు చెందిన నల్లజాతి వారు భూములు కలిగివుండరాదనే చట్టం వచ్చింది. అక్కడి నుంచి మొదలైన భూముల దోపిడి స్వతంత్రం వరకూ కొనసాగింది. ఆ తర్వాత దేశంలోని అధిక శాతం అంటే 87 శాతానికి పైగా భూములను తెల్లజాతి వారు కలిగివున్నారు. నల్లజాతి వారు కేవలం 13 శాతం భూములను కలిగివున్నారు.

దీన్ని మార్చేందుకు 1994లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ‘అమ్మేవారు-కొనేవారు’ పథకాన్ని ప్రారంభించి, తెల్లజాతీయుల నుంచి భూమిని కొని నల్లజాతి వారికి పంచాలని సంకల్పించింది. అయితే, ఇది మొదలై 24 ఏళ్లు గడుస్తున్నా కొనుగోలు చేసిన భూములను వేళ్లపై లెక్కించొచ్చు. దీంతో భూములను స్వాధీనమే ఇందుకు పరిష్కారమని సరిల్‌ సర్కారు భావించింది. ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించకుండా తెల్లజాతి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు