ప్రియాంకకు తన వ్యక్తిగత అంశాలపై స్పందించే హక్కుంది: యూఎన్‌

23 Aug, 2019 10:50 IST|Sakshi

అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా బాలాకోట్‌ వైమానికి దాడులను సమర్థించడంతో ఆమెను యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తొలగించాలంటూ పాక్‌ మానవ వనరుల శాఖ మంత్రి షిరిన్‌ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై యూఎన్‌ స్పందించింది. తనకు సంబంధించిన అంశాలపై.. తన వ్యక్తిగత సామార్థ్యం మేరకు స్పందించే హక్కు ప్రియాంకకు ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.            
(చదవండి: కశ్మీర్‌పై ఐరాసలో రహస్య చర్చలు)

ఈ మేరకు యూఎన్‌ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తికి తన వ్యక్తిగత లేదా తనకు సంబంధించిన సమస్యలపై స్పందించే హక్కు ఉంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, చర్యలతో యూనిసెఫ్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ యూనిసెఫ్‌ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిరాధార వ్యాఖ్యలను ప్రోత్సాహించము. అంతేకాక స్వచ్ఛందంగా తమ సమయాన్ని, వారి గుర్తింపును పిల్లల హక్కులు కాపాడటం కోసం వినియోగించడానికి అంగీకరించిన ప్రముఖులను మాత్రమే యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా నియమిస్తాం’  అని తెలిపారు.

బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌ హోదాలో ప్రియాంక చోప్రా సమర్ధించడం పట్ల లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రియాంకను పాక్‌కు చెందిన ఆయేషా అనే మహిళ నిలదీశారు. ప్రియాంక తీరును కపటత్వంగా ఆయేషా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై ప్రియాంక ఆ వేదికపై దీటుగా స్పందించారు. తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. తన దేశం పట్ల అభిమాననాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని ప్రియాంక స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు