ఏం తప్పు చేశాను.. ఆమెను నా ప్రాణం కంటే..

3 Nov, 2019 13:16 IST|Sakshi

నేను ఖమ్మంలో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. అక్కడ మా అక్క వాళ్లు ఉండటం వల్ల కళాశాల ముగిసిన వెంటనే అక్కవాళ్ల ఇంటికి వెళ్లేవాడిని. ఆ సమయంలో అక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మా పరిచయం స్నేహంగా మారడానికి కొన్ని నెలలు పట్టింది. స్నేహం కాస్తా ప్రేమగా మారిపోయింది. తనతో జీవితం పంచుకోవాలని అనుకున్నాను. ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. మా ప్రేమ ప్రయాణంలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి నా ఫోన్‌ అందుబాటులో లేకపోవటం వల్ల తనతో మాట్లాడలేకపోయాను. మరుసటి రోజు తను నేరుగా మా ఊరికి వచ్చింది. అలా మా తల్లి దండ్రులకు మా విషయం తెలిసింది.

తప్పనిసరి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులకు విషయం అంతా వివరించి ఆఖరికి పెళ్లికి ఒప్పించాను. కొన్ని నెలల తర్వాత తనతో మాట్లాడటానికి కాల్‌ చేసినా తను పట్టించుకోలేదు. తిరిగి కాల్‌ చేయలేదు. తన మీద ప్రేమ చంపుకోలేక, వేరే అమ్మాయి మీద ప్రేమను చూపలేక పిచ్చిప్రేమతో కొన్ని నెలలు నరకంలా గడిచాయి. ఇంతలో డిగ్రీ మూడవ సంవత్సరం పరీక్షలు వచ్చాయి. బాగా రాశాను. ఆ తర్వాత ఆమె గురించి ఎంత వెతికినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తన ఆచూకీ గానీ, మరే ఇతర విషయాలు తెలియలేదు.

ఒకరోజు తన స్నేహితురాలు కలిసింది. ఆమె గురించి అడిగి తెలుసుకున్నాను. ఆఖరికి తెలిసిందేంటంటే తను నన్ను వదిలేసి వేరే అబ్బాయిని ప్రేమిస్తుందని. ఆ విషయం తెలిసిన నిమిషం నుంచి అంతగా ప్రేమించిన తను నన్ను ఇంతగా మోసం చేసిందా అని భరించలేకపోయాను. అలా తన మీద ప్రేమను మరిచిపోలేక మద్యానికి బానిసనయ్యా. కానీ ఆమె మాత్రం నన్ను పూర్తిగా మరిచిపోయి తనకు నచ్చిన వాడితో పెళ్లిచేసుకుని సంతోషంగా ఉంది. నేను ఏం తప్పు చేశాను. తనను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. నా కుటుంబంలో తనకు స్థానం కల్పించాను. అయినా ఆఖరికి నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయింది.
- దుర్గయ్య, ఖమ్మం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు