కస్తూరిపై మండిపడ్డ నటి లత

11 Apr, 2019 09:57 IST|Sakshi
నటి కస్తూరి,నటి లత

పెరంబూరు: తనను, ఎంజీఆర్‌ను అసభ్యంగా మాట్లాడతావా? ఒళ్లు దగ్గర పెట్టుకో. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది అని సీనియర్‌ నటి లత, నటి కస్తూరిని హెచ్చరించారు. నటి కస్తూరి ఇటీవల తరచూ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా ఎంజీఆర్, లతను కించపరచే విధంగా మాట్లాడింది. ప్రస్తుతం టీ 20 క్రికెట్‌ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం చెన్నైలో కోల్‌కత్తా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు మందకొడిగా ఆడుతున్న తీరును ట్విట్టర్‌లో పేర్కొంటూ ఏంటయ్యా ఇది పళ్లాండు వాళ్గ చిత్రంలో వాద్యియార్‌ (ఎంజీఆర్‌) లతను తడిమిన దానికంటే అధికంగా తడుముతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్‌ చేసింది.

దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్‌ అభిమానులు కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. కాగా కస్తూరి ట్వీట్‌పై నటి లత తీవ్రంగానే స్పందించారు. తనను, ఎంజీఆర్‌ను కలుపుతూ అసభ్య వ్యాఖ్యలు చేయడం వేదన కలిగించిందన్నారు. ఇంత అసభ్యంగా ట్వీట్‌ చేసిన నటి కస్తూరికి అణకువ, నాగరికం అవసరం అని అన్నారు. ఆమె నటించిన దానికంటే ఎక్కువగా తాము నటించలేదని అన్నారు. అప్పటి చిత్రాల్లోని పాటల సన్నివేశాలు ఎంత ఉన్నతంగా ఉండేవన్నది అందరికీ తెలుసన్నారు. నటి కస్తూరి తన ప్రవర్తనను మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని లత హెచ్చరించారు.

మరిన్ని వార్తలు