Amitabh Bachchan: వరల్డ్‌ కప్‌కు వెళ్లొద్దంటూ అమితాబ్‌ బచ్చన్‌కు నెటిజన్ల స్వీట్‌ వార్నింగ్‌

17 Nov, 2023 16:20 IST|Sakshi

ప్రస్తుతం యావత్‌ భారత్‌ కోరుకుంటోంది ఒక్కటే.. వరల్డ్‌ 'కప్పు'. ఇప్పటికే ఒక్కో ఆట గెలుచుకుంటూ వచ్చి ఫైనల్‌లో అడుగుపెట్టింది భారత క్రికెట్‌ జట్టు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుతో భారత్‌ తలపడనుంది. కోట్లాది మంది ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌ గెలుపు కోసం శతకోటి ప్రార్థనలు చేస్తున్నారు.

నేను చూడకపోతే భారత్‌ గెలిచింది
ఈ ‍క్రమంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మాత్రం ఈ మ్యాచ్‌ చూడటానికి రాకూడదంటూ కొందరు నెటిజన్లు స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. దీనిపై అమితాబ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందిస్తూ.. 'నేను చూడకపోతే ఇండియా మ్యాచ్‌ గెలిచింది' అని రాసుకొచ్చాడు. ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే జనాలు బిగ్‌బీని ఫైనల్‌కు రావొద్దని కోరుతున్నారు.

ఈసారి కూడా మ్యాచ్‌ చూడొద్దు.. ప్లీజ్‌
ఆయన మ్యాచ్‌ చూడకపోతే భారత్‌ గెలుపు తథ్యమని భావిస్తున్న కొందరు.. 'ఈ ఒక్కసారి మాకోసం త్యాగం చేయండి', 'ఆదివారం జరిగే ఫైనల్స్‌కు దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేస్తాం..' అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన బిగ్‌బీ.. 'ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని మరో ట్వీట్‌ చేశారు. దీంతో అభిమానులు మరింత కంగారుపడుతూ ఆ పని మాత్రం చేయొద్దు.. అంటూ ఏకంగా దండాలు పెట్టేస్తున్నారు. మరి ఫైనల్స్‌కు బిగ్‌బీ వెళ్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

చదవండి:  యాంకర్‌ సుమ ప్రశ్నలు.. కౌంటర్లిచ్చిన హీరో.. పరువు పాయే..

మరిన్ని వార్తలు