పాంచ్‌ పటాకా

4 Nov, 2017 01:39 IST|Sakshi

ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు సినిమాలు... కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకటించి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు సుధీర్‌బాబు. అందులో రెండు సినిమాల ద్వారా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తున్నారు. ఐదు సినిమాల్లో ఓ సోషల్‌ థ్రిల్లర్‌తో  ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో కూడిన ఓ ప్రేమకథతో  సుధీర్‌ మరో సినిమా చేయనున్నారు. రాజశేఖర్‌ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాను సుధీర్‌ స్వయంగా నిర్మించనున్నారు.

అలాగే, ‘శ్రీదేవి మూవీస్‌’ సంస్థలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలిపారు. మరో సినిమా వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడిస్తుందన్నారు. అది ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నటించనున్న పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ అయ్యుంటుందని ఊహిస్తున్నారంతా. నటుడు–రచయిత హర్షవర్థన్‌ దర్శకత్వంలో అమెరికా నేపథ్యంలో లవ్‌ థ్రిల్లర్‌గా ఓ సినిమా చేయనున్నారు. ఇది బైలింగ్వల్‌ అట! మొత్తం మీద కార్తీక పౌర్ణమి రోజున పాంచ్‌ పటాకా పేల్చారు సుధీర్‌బాబు. ఈ ఐదు సినిమాల్లో రెండు పూర్తి కావచ్చాయని సుధీర్‌ తెలిపారు.

డిసెంబర్‌లో స్టార్ట్‌
‘జెంటిల్‌మెన్, అమీతుమీ’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌లో స్టార్ట్‌ కానుంది. అదితీ రావ్‌ హైదరీ కథానాయిక. ఇంద్రగంటితో ‘జెంటిల్‌మెన్‌’ వంటి హిట్‌ తీసిన శ్రీదేవి మూవీస్‌ ప్రొడక్షన్స్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘‘ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా నడిచే కొత్త తరం ప్రేమకథా చిత్రమిది అన్నారు’’ ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘డిసెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత.

మరిన్ని వార్తలు