ఇద్దరు పైలట్ల కొంప ముంచిన నిత్యామీనన్ సరదా!

19 Jul, 2013 12:30 IST|Sakshi
ఇద్దరు పైలట్ల కొంప ముంచిన నిత్యామీనన్ సరదా!
ఒక్కోసారి తమ సరదా కోసం చేసే పనులు ఇతరులను బలి చేస్తాయి. అలా ఇటీవల నిత్యామీనన్ సరదాకి ఇద్దరు పైలట్లు బలయ్యారు. ఆ మధ్య ఈ మలయాళ సుందరి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చే విమానంలో ప్రయాణం చేశారు. విమానం ఎక్కడం నిత్యాకి కొత్త కాదు. కానీ అందులోని ‘కాక్‌పిట్’లో కూర్చుని ప్రయాణం చేయాలనే కోరిక ఎప్పట్నుంచో నిత్యాకు ఉందట. 
 
 కాక్‌పిట్ అంటే తెలియనది కాదు... విమానాన్ని కంట్రోల్ చేసే పైలట్లు అందులో ఉంటారు. ఇతరులకు అందులోకి ప్రవేశం లేదన్నమాట. కానీ సాక్షాత్తు హీరోయిన్ కోరితే కాదంటారా? అనుమతించేశారు. ఎంచక్కా నిత్యా కాక్‌పిట్‌లోకి దూరిపోయి, కొత్త అనుభూతిని పొందడం చూసి, ఓ ప్రయాణికుడికి వళ్లు మండిపోయిందట. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అతను ఈ విషయం గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేశారనే వార్త వెలుగులోకి వచ్చింది.
 
 పైలట్ల స్థానంలో ప్యాసింజర్లా... ఏదైనా జరగకూడనిది జరిగితే మా పరిస్థితి ఏం కాను? అంటూ ఆ ప్రయాణికుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో అధికారులు ఆ ఇద్దరు పైలట్లను చెడామడా తిట్టి, సస్పెండ్ చేశారు. ఇటీవలి కాలంలో తీవ్రవాదుల దాడులు అధికమవ్వడంతో కాక్‌పిట్‌లోకి ఇతరులను అనుమతించకూడదని బలమైన రూల్ ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ఈ సంఘటన జరగడంతో అధికారులు కాస్తంత సీరియస్‌గానే ఈ విషయాన్ని తీసుకున్నారు.