ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

20 Jul, 2019 08:44 IST|Sakshi

విద్యా బాలన్‌పై అక్షయ్‌కుమార్‌ సెటైర్‌

‘పరిణీత’ సినిమాతో 2005లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విద్యా బాలన్‌.. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2011లో వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా విద్యాబాలన్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యతోపాటు తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మాన్‌ జోషి, నిత్యా మీనన్‌, కృతి కుల్హారీ తదితరులు నటించారు. 

ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ సందర్భంగా ఓ విలేకరి విద్యా బాలన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి విద్యా స్పందిస్తూ.. అవార్డుల గురించి నేను ఆలోచించనని బదులివ్వగా.. వెంటనే అక్షయ్‌ కలగజేసుకుంటూ.. తను అబద్ధం చెప్తోందన్నారు. ‘ఈమె పుట్టగానే.. జాతీయ అవార్డు వచ్చిందంటూ కుటుంబసభ్యులకు నర్సు శుభాకాంక్షలు చెప్పింది’ అంటూ అక్షయ్‌ ఛలోక్తి విసిరారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. 

మరిన్ని వార్తలు