‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు అప్డేట్కు సంబంధించి చిత్ర బృందం సోమవారం ఒక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు అప్డేట్ను రివీల్ను చేయనున్నట్టు పేర్కొంది.
‘ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే.. ఏఏ20 అప్డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా’ అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. అయితే ఆ రోజున చిత్ర టైటిల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మికా మందన్నా నటిస్తున్నారు.