బిగ్‌ బీ పెద్ద మనుసు

20 Oct, 2018 11:18 IST|Sakshi

తెరపైనే కాదు నిజ జీవితంలోను సూపర్‌ స్టార్‌నే అని నిరూపించుకున్నారు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌. రుణాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలు ఆదుకునేందుకు ముందుకు వ​చ్చారు అమితాబ్‌. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్‌ బీ ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ ‘మన కోసం త్యాగాలు చేస్తున్న రైతన్నలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను. గతంలో ఆంధ్ర, విదర్భకు చెందిన రైతుల రుణాలు మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ రైతుల రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నాను అని తెలిపారు.

అంతేకాక ‘యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను మేము గుర్తించాము. వారి మొత్తం రుణాలూ కలిసి రూ.5.5 కోట్ల రూపాయలుగా తెలిసింది. ఈ మొత్తాన్ని నేను చెల్లించాలని భావిస్తున్నాను. మనకోసం ఎనెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు నాకు తోచిన ఈ చిన్న సాయం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చే విషయం’ అని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

వ్యభిచార గృహాల్లో ఉన్న వారి కోసం...
కేబీసీ కరంవీర్‌లో కనిపించిన అజీత్‌సింగ్‌కు కూడా సాయం అందచేస్తానని బిగ్‌ బీ తెలిపారు. ఎంతో మంది యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశారు. వారంతా చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి పునరావాసం, రక్షణల కోసం పాటుపడుతున్న అజీత్‌సింగ్‌కు తాను శనివారం చెక్కును పంపనున్నట్లు అమితాబ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు