లైట్స్‌ ఆన్‌.. స్టార్ట్‌ కెమెరా.. యాక్షన్‌

19 Dec, 2017 00:14 IST|Sakshi

...అని డైరెక్టర్‌ అనగానే ఇప్పటివరకూ నటించిన అరవింద్‌ స్వామి వచ్చే ఏడాది లైట్స్‌ ఆన్‌.. స్టార్ట్‌ కెమెరా.. యాక్షన్‌ అనబోతున్నారు. ‘బొంబాయి, రోజా’ సినిమాలతో చాలామంది మనసుల్లో నిలిచిపోయారు ఈ అప్పటి లవర్‌ బోయ్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాక ఇటీవల రామ్‌చరణ్‌ ‘ధృవ’లో విలన్‌గా కూడా చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూనే, హీరోగానూ నటిస్తున్నారు. ఆర్టిస్ట్‌గా ఆయన ఫుల్‌ బిజీ.

అయినప్పటికీ అరవింద్‌స్వామి మెగా ఫోన్‌ పట్టనున్నారంటూ చాలా రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే అంటూ చెప్పుకొచ్చిన ఆయన తాజాగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘కొత్త సంవత్సరం 2018లో డైరెక్షన్‌ చేసే ఆలోచన ఉంది. ఎవరి ఊహకు అందని కథతో సినిమా తీస్తా’’ అని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు