రిస్క్‌ ఎందుకన్నా అన్నాను

3 Dec, 2019 00:11 IST|Sakshi
శ్రీనివాస్‌రెడ్డి,అనిల్‌ రావిపూడి

– అనిల్‌ రావిపూడి

‘‘నాకున్న క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్‌ కలర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో బ్యానర్‌ లోగోను అనిల్‌ రావిపూడి, టైటిల్‌ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్‌.యస్‌. తమన్‌ విడుదల చేశారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్‌ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్‌ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్‌ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్‌’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్‌ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు తమన్‌. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్‌  తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు