జూన్‌లో షురూ

13 May, 2019 03:25 IST|Sakshi
నితిన్‌

బ్యాచిలర్‌ లైఫే సో బెటర్‌ అంటున్నారు హీరో నితిన్‌. మరి.. ఆయన అలా ఎందుకు అంటున్నారో వెండితెరపై చూడాల్సిందే. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘సింగిల్‌ ఫరెవర్‌’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘ఛలో’ సినిమాతోనే రష్మికా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది.

‘భీష్మ’ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ మొదటివారంలో స్టార్ట్‌ కానుందని తెలిసింది. పక్కా కమర్షియల్‌ అంశాలతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్లాన్‌ చేశారట. నటీనటుల ఎంపికలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారట నితిన్‌ అండ్‌ టీమ్‌. ఈ సినిమా కాకుండా... చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణచైతన్య దర్శకత్వాల్లోనూ సినిమాలు చేయనున్నారు నితిన్‌. ఇలా వరుస సినిమా కమిట్‌మెంట్స్‌తో నితిన్‌ ఫుల్‌ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు