అమ్మా... అమ్మోరు తల్లీ...

9 Oct, 2016 23:53 IST|Sakshi
అమ్మా... అమ్మోరు తల్లీ...

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ‘అమ్మా.. అమ్మోరు తల్లీ..’ అంటూ అమ్మవారిని పూజిస్తున్నారు. హిందీ తారలైతే ఇంట్లో పూజలు చేయడంతో పాటు వీధుల్లో అక్కడక్కడా పెట్టే అమ్మవారి విగ్రహాలను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ అమితాబ్ బచ్చన్ కుటుంబం, కాజోల్, సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ వంటి తారలు తప్పనిసరిగా అమ్మవారిని సందర్శిస్తుంటారు.
 
అందరూ ఒకే ఏరియాకి కాకపోయినా ఎవరి సౌకర్యానికి తగ్గట్టుగా వాళ్లు వెళుతుంటారు. కొడుకు, కోడలు, మనవరాలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యా బచ్చన్, భార్య జయాబచ్చన్, కూతురు శ్వేతానందాతో కలిసి అమితాబ్ బచ్చన్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అభి, ఐష్, ఆరాధ్యలను జనాలు చుట్టుముట్టేసి, ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఇక, కాజోల్ విషయానికొస్తే, కూతురు నైసా, కొడుకు యుగ్, తల్లి తనూజలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
 
ఎప్పటిలానే సందడి సందడిగా ప్రసాదం పంచారు. దత్త పుత్రికలు రీనీ సేన్, అలీషా సేన్‌తో సుస్మితా సేన్ అమ్మోరు తల్లికి పూజలు నిర్వహించారు. డింపుల్ బ్యూటీ ఆలియా భట్ కూడా అమ్మవారిని దర్శించుకుని, తన భక్తిని చాటుకున్నారు. ఇంకా బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌అమ్మోరు తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించారు.