మహిళా జర్నలిస్ట్ ‘ప్రతిఘటన’

2 Jan, 2014 05:15 IST|Sakshi
చార్మి

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతమే ప్రధానాంశంగా, చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ -‘‘స్త్రీకి రక్షణలేని నేటి సమాజం స్థితి గతులకూ, నేటి రాజకీయ పరిస్థితులకు అద్ధం పట్టే సినిమా ఇది. ఇందులో మహిళా జర్నలిస్ట్‌గా చార్మి నటిస్తుండగా, అత్యాచార బాధితురాలి పాత్రను రేష్మ పోషిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి.