Israel-Hamas war: అమానుషం, కన్నీరుమున్నీరుగా విలపించిన జర్నలిస్టు 

26 Oct, 2023 13:32 IST|Sakshi

గాజాపై ఇజ్రాయెల్(Israeil) జరిపిన వైమానిక దాడిలో  గాజాలోని జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు  కోల్పోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్   వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు మరణించారు.  సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా  భావిస్తున్న నుసెరాత్ క్యాంప్‌  అతని ఇంటిని లక్ష్యంగా  జరిగిన దాడిలో భార్య, కుమార్తె , కొడుకును కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో  నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని  భార్య తెలుసుకున్నారు.  అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపైదాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె మరణించారని అల్ జజీరా రిపోర్ట్‌  చేసింది. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. 

ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌహ్   కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి.  “ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు , పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస  దాడులివి.   ఇజ్రాయెల్ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల  గురించి యార్మూక్ నుండి రిపోర్టు చేస్తున్నాను..అంటూ  ఉద్వేగానికి లోనయ్యారు.  ఇజ్రాయెల్  ఆధీనంలో   ఉన్న వారికి  శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన  వ్యక్తం చేశారు.  మరోవైపు  గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్ జజీరా తీవ్రంగా  ఖండించింది.మరికొంతమంది జర్నలిస్టుల కుటుంబ  సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచార.ం

 తీవ్ర విషాదానికి ముందు
మమ్మల్ని కాపాడండి అంటూ వేల్ దహదౌ కుమారుడు మహమూద్, తల్లి, సోదరితో కలిసి మొరపెట్టుకున్న  కొద్దిరోజులకే వారంతా చనిపోయారు.గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి గురించి  సోదరి ఖోలౌద్‌తో కలిసి ప్రపంచానికి  ఒక వీడియో సందేశం పంపాడు.

కాగా అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడిలో దాదాపు 1,400 మందిని  చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకారణంగా గాజాలో 6,500 మందికి పైగా మరణించినట్టు అంచనా. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా దాదాపు 6,00,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.  ఇది ఇలా ఉంటే  పాలస్తీనా జర్నలిస్టుల యూనియన్ ప్రకారం గాజా బాధితుల్లో 22 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు.

మరిన్ని వార్తలు