నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

18 Sep, 2019 07:01 IST|Sakshi

బెంగళూరు : నా అభిమానుల జోలికి రావద్దని, వారిపట్ల ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తే ఊరుకునేది లేదని హీరో దర్శన్‌ హెచ్చరించారు. సుదీప్‌ నటించిన పైల్వాన్‌ సినిమా విషయంలో నటుడు దర్శన్, సుదీప్‌ అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఈ విషయం నటుల వరకు చేరింది. దీంతో దర్శన్‌ తన అభిమానులను ఎవరిని ఏమి అనొద్దని ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరి నటుల మధ్య, అభిమానుల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది. సుదీప్‌ నటించిన పైల్వాన్‌ సినిమాను దర్శన్‌ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్‌ అభిమానులు దర్శన్‌ అభిమానులపైన ఆరోపణలు చేస్తున్నారు. దర్శన్‌ ట్వీట్‌ను చూసిన సుదీప్‌ అభిమానులు కూడా ఎక్కడ తగ్గకుండా సమాధానం ఇచ్చారు.

దర్శన్‌ మీరు మీ అభిమానులను అన్నదాతలు, సెలబ్రెటీలు అని పిలిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషం, ఈ విషయంలో అభిమానులుగా తాము కూడా చాలా గర్వపడుతున్నాము. అయితే మీ అభిమానులు వేరే వాళ్ల అన్నం గుంజుకొని తింటున్నారు. మేము ఎవరి అన్నం లాక్కోలేదు. ఎవరి గురించి చులకనగా మాట్లాడలేదు. ఒక నటుడి సినిమాను డీప్రమోట్‌ చేయడం ఎంత వరకుసమంజసం,  ఈ విషయం మీ అభిమానులకు తెలియదా? మీ సినిమా విడుదల అయిన సమయంలో మేము కూడా ఇలా మీ సినిమాను డీప్రమోట్‌ చేస్తే మీకు బాధ కలగదా, అనిపించదా మీకో న్యాయం మాకో న్యాయమా చెప్పండి అంటు సోషల్‌ మీడియాలోనే సుదీప్‌ అభిమానులు పోస్టు చేశారు. దీంతో ఇద్దరి హీరోలు, అభిమానుల మధ్య సోషల్‌ వార్‌ వేడి వేడిగా జరుగుతోంది.   

హెచ్చరికలు పట్టించుకోను
ఎవరి హెచ్చరికలను తాను పట్టించుకోనని హీరో సుదీప్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. దర్శన్‌ ట్విటర్‌పై ఆయన తన ట్విటర్‌ ఖాతాలో స్పందించారు. తన పైల్వాన్‌ చిత్రం విడుదల నుంచి అనేక విషయాలు జరుగుతున్నాయని, అయితే అవి మంచివి కావన్నారు. అదే విధంగా అన్ని సమయాల్లో సమాధానం ఇవ్వటం మంచిది కాదన్నారు. ఇందులో ఎవరి తప్పు ఉందో లేదో, ఏది అబద్ధమో తెలియదు, అలాంటి సమయంలో అన్నింటికి స్పందించాల్సిన అవసరం లేదు అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు