యాసిడ్‌ బాధితురాలిగా..

3 Oct, 2018 00:31 IST|Sakshi

అదుగో ఇదిగో అంటూ సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ తన తాజా సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై మాత్రం దీపికా పదుకోన్‌ స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో దీపిక ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించబోతున్నారని బీటౌన్‌లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్‌ అనే యాసిడ్‌ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలవుతుందని బాలీవుడ్‌లో ఓ వార్త షికారు చేస్తోంది.

పదిహేనేళ్ల వయసులో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ ఆ తర్వాత యాసిడ్‌ దాడులను ఆపేందుకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో జరిగిన చేదు ఘటనకు కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోన్న లక్ష్మీ అగర్వాల్‌ చాలామందికి స్ఫూర్తినిస్తుందని దీపిక భావిస్తున్నారు. అందుకే ఆమె జీవితకథలో నటించబోయే ఈ సినిమాకు సహ–నిర్మాతగా కూడా వ్యవహరిస్తారట. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ నిర్మాణ సంస్థలు ప్రారంభించారు. ఇప్పుడు దీపికా. 

 

మరిన్ని వార్తలు