సౌందర్యా రజనీకాంత్ స్క్రిప్ట్ షురూ!

28 Sep, 2016 00:31 IST|Sakshi
సౌందర్యా రజనీకాంత్ స్క్రిప్ట్ షురూ!
 రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఆరేళ్ళ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ, వ్యాపారవేత్త అయిన భర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో విడాకులకు సిద్ధమవుతు న్నారంటూ ఇటీవలే మీడియా అంతా సౌందర్య పేరు మారుమోగింది. ఆ వార్త నిజమేనంటూ ప్రకటించిన ఆమె కొత్త ప్రయత్నాల్లో పడ్డారు. గతంలో తన తండ్రితో మోషన్ క్యాప్చర్ 3డి ఫిల్మ్ ‘కొచ్చడయాన్’ రూపొందించిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో మామూలు ఫీచర్ ఫిల్మ్ రూపొందించే పనిలో ఉన్నారు.
 
  ఇటీవలే రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా తీసిన ప్రముఖ నిర్మాత ‘కలైపులి’ ఎస్. థానూయే ఈ కొత్త ప్రాజెక్ట్‌కి నిర్మాత. ఇప్పటికే థాను బృందం మరో తమిళ సినిమా ‘ఇంద్రజిత్’ రూపకల్పనలో బిజీగా ఉంది. ఆ మధ్య మణిరత్నం ‘కడలి’ సినిమాలో నటించిన గౌతమ్ కార్తీక్ (ఒకప్పటి హీరో కార్తీక్ కుమారుడు)తో కళాప్రభు దర్శకత్వంలో ‘ఇంద్రజిత్’ సినిమా రూపొందిస్తోంది. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్యాంటసీ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతుండగానే, మరోపక్క ప్రస్తుతం సౌందర్యా రజనీకాంత్‌తో సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టించారు. 
 
 ఈ కొత్త సినిమాకు కావాల్సిన నటీనటుల కోసం తాజాగా ప్రకటన కూడా ఇచ్చారు. ఓ ప్రముఖ తమిళ యువ హీరో ఇందులో కథానాయకుడిగా నటిస్తారని కోడంబాకమ్ వర్గాల కథనం. సౌందర్య అక్క, హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య గతంలో దర్శకురాలిగా తమిళంలో ‘3’, ‘వెయ్ రాజా వెయ్’ సినిమాలు తీశారు. ‘3’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డీ’ పాట దేశవిదేశాల్లో ఎంత సంచలనమో అందరికీ తెలుసు.
 
  మరి గతంలో గ్రాఫిక్స్ డిజైనర్‌గా పనిచేసి, నిర్మాతగా ప్రయత్నించి, ఇప్పుడు అక్క ఐశ్వర్య బాటలోకి వచ్చిన సౌందర్య ఏ సంచనాలు సృష్టిస్తారో చూడాలి. సినిమాలు, వాటి ఫలితాల మాటెలా ఉన్నా ‘కబాలి’తో రజనీకాంత్‌కీ, ఆయన కుటుంబానికీ నిర్మాత థాను బాగా దగ్గరైనట్లే కనిపిస్తోంది కదూ!