ఫుల్‌ జోష్‌!

8 Dec, 2018 00:30 IST|Sakshi
కల్యాణి ప్రియదర్శన్‌

తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే కొత్త సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్‌. ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ శర్వానంద్‌తో ఓ సినిమా చేశారు. ఇది రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే మాలీవుడ్‌లో ‘మరార్కర్‌: అరబికడలింటే సింగమ్‌’ అనే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించనున్న తమిళ సినిమా ‘వాన్‌’లో నటించడానికి ఊ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్నారీ భామ. ఈ సినిమాతో రా కార్తీక్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు.

అలాగే ఈ సినిమాలో కృతి కర్భందా మరో కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ‘‘ఇది ఒక ట్రావెల్‌ ఫిల్మ్‌. కథ పరంగా కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఫ్రెష్‌ ఫేస్‌ కోసం కల్యాణిని తీసుకున్నాం. తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. ప్రచారంలో ఉన్నట్లు ఇది బైలింగ్వల్‌ సినిమా కాదు. కేవలం తమిళంలోనే తెరకెక్కిస్తాం’’ అని దర్శకుడు కార్తీక్‌ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు నివేథా పేతురాజ్‌ని ఎంపిక చేయాలని టీమ్‌ ఆలోచిస్తోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు