విడాకులు తీసుకోవడం లేదు

6 Apr, 2017 07:35 IST|Sakshi
విడాకులు తీసుకోవడం లేదు

చెన్నై: నటి రంభ విడాకుల కేసు సుఖాంతమైంది. ఇంద్రన్‌కుమార్, రంభ కలసి జీవించేందుకు సమ్మతించారు. రంభ నటనకు స్వస్తి చెప్పి 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌కుమార్‌ను పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం అనంతరం మనస్పర్థలు రావడంతో రంభ భర్తను వదిలి చెన్నైకి వచ్చేసింది. దీంతో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2016లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని కోరింది. దీనిపై పలుమార్లు విచారణ నిర్వహించిన కోర్టు.. ఇంద్రన్‌కుమార్‌తో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ మేరకు చర్చించుకున్న రంభ, ఇంద్రన్‌కుమార్‌లు కలసి జీవించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని వీరిద్దరూ బుధవారం న్యాయస్థానానికి తెలియజేయడంతో కేసును మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.