అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

25 Sep, 2019 10:19 IST|Sakshi

నటి తమన్నాను గత ఏడాది నుంచి వదలకుండా వెంటాడుతూనే ఉందట. ఇంతకీ అదేంటనేగా మీ, మన ఆసక్తి. చూసేస్తే పోలా.. సుమారు దశాబ్దంన్నర పాటు కథానాయకిగా వెలిగిపోతున్న నటి తమన్నా. ఈ ముంబయి అమ్మడు బాలీవుడ్‌లో కంటే టాలీవుడ్, కోలీవుడ్‌లోనే బహుళ ప్రాచుర్యం పొందిన నటి. తన కెరీర్‌లో అన్ని తరహాలు పాత్రలు పోషించేసి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్క్రీన్‌ షోను ప్రదర్శించడంలో తన తరువాతే ఎవరైనా అన్నంతగా పేరు తెచ్చుకుంది.

అడపాదడపా అభినయానికి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించినా, ఈ మిల్కీబ్యూటీ ఇప్పుటికీ గ్లామర్‌కు పేటెంట్‌ తనే. అలాంటిది తాజాగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుందట. అదేమిటో తెలుసా? ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలన్నది. అలాంటి పాత్రకు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి కూడా రెడీ అట. అంతేకాదు పాత్రల్లో సత్తా లేకపోతే అవి స్టార్‌ హీరోలతో నటించే చిత్రాలైనా నో చెప్పానంటోంది. అలా పాత్రలపై ఇకపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. 

సడన్‌గా తమన్నా ఇలాంటి నిర్ణయానికి రావడంలో మతలబు ఏంటబ్బా అని సినీ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తమన్నా గత ఏడాది ముంబయిలో ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ అమ్మడిని పెళ్లి వెంటాడుతోందట. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోందట. అయితే ఈ అమ్మడికి పెళ్లి గడియలు తోసుకొస్తున్నాయని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ముంబయికి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్తతో డుండుం, పీ పీ పీనేనన్నది తాజా సమాచారం.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు విశాల్‌తో జత కట్టిన యాక్షన్‌ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఇక హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలో నటిస్తున్న పెట్రోమాక్స్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్రాన్ని నటుడు విజయ్‌ చిత్రం బిగిల్‌కు పోటీగా దీపావళికి విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం సైనా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా చాలా కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. 

మరిన్ని వార్తలు