అలాగైతేనే రండి!

28 Mar, 2019 10:30 IST|Sakshi

సినిమా: అలాగైతేనే రండి అంటోంది నటి అను ఇమ్మానుయేల్‌. ఈ విదేశీ బ్యూటీ మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరకు ఎదిగిన నటి అన్నది తెలిసిందే. తొలుత మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఆపై టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. తెలుగులో నటించిన మజ్ను లాంటి చిత్రాలు సక్సెస్‌ అవడంతో స్టార్‌ హీరోల దృష్టిలో పడింది. అయితే అక్కడ పవన్‌కల్యాణ్‌తో నటించిన అజ్ఞాతవాసి, అల్లుఅర్జున్‌తో రొమాన్స్‌ చేసిన నా పేరు సూర్య వంటి భారీ చిత్రాల ఢమాల్‌ అనడంతో ఈ అమ్మడి డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తరువాత నటించిన శైలజారెడ్డి లాంటి చిత్రాలు అనుఇమ్మానుయేల్‌కు ఏ మాత్రం ప్లస్‌ అవలేదు. దీంతో చేతిలో ప్రస్తుతం నాగార్జునతో జత కడుతున్న ద్విభాషా చిత్రం ఒక్కటే ఉంది. ఇక తమిళంలో ఈ అమ్మడికి పెద్దగా క్రేజే లేదు.

ఆ మధ్య విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయినా, ఇక్కడ పట్టించుకున్న వారు లేరు. గ్లామర్‌ విషయంలో అభ్యంతరాలు పెట్టకపోయినా అవకాశాలు రాకపోవడం ఏమిటో ఈ బ్యూటీకి అర్థం కావడం లేదట. దీంతో పునరాలోచనలో పడ్డ అనుఇమ్మానూయేల్‌ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చిందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలు కాకుండా గ్లామర్‌ డాల్‌ పాత్రలను పోషించడం వల్లే తనకు అవకాశకాలు రావడం లేదని భావించిన అనుఇమ్మానూయేల్‌ ఇకపై అలాంటి పాత్రలపై దృష్టిసారించాలని తీసుకుందట. దీంతో ఇటీవల తనను కలిసి కథ చెప్పాలని ప్రయత్నించిన దర్శకులకు తన పాత్ర మాత్రమే కాకుండా పూర్తి కథను వినిపించాలని చెబుతోందట. అంతే కాదు ఇకపై పూర్తి బైండ్‌ స్క్రిప్ట్‌తోనే తనను కలవాలని షరతులు విధిస్తోందట. ఇంతకు ముందు హీరోహీరోయిన్లకు దర్శకులు కథను వినిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తి బైండ్‌ స్క్రిప్ట్‌ తయారు చేసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడు నటి అనుఇమ్మానూయేల్‌ అదే దారిలో పయనించాలని నిర్ణయించుకుందట. అయితే అసలే అవకాశాలు ముఖం చాటేస్తున్న పరిస్థితుల్లో ఈ అమ్మడి షరుతులు వర్కౌట్‌ అవుతాయా అన్నదే చర్చ. ప్రస్తుతం నటిస్తున్న ద్విభాషా చిత్ర నిర్మాణమే నత్త నడకన నడుస్తోందన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు