‘నా మాటలు వక్రీకరించారు’

15 Jan, 2018 16:50 IST|Sakshi
బిగ్‌బాస్‌ షోలో హినా ఖాన్‌

ముంబై: గెలుపు కంటే గౌరవం పొందడం ముఖ్యమని ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హినా ఖాన్‌ పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షో ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఫైనల్‌ వరకు వస్తానని ఊహించలేదని, మధ్యలోనే ఎలిమినేట్‌ అవుతానని అనుకున్నానని తెలిపారు.

‘పోటీలో చివరి వరకు ఉంటానని అనుకోలేదు. టాప్‌-5కు చేరాలని మాత్రమే అనుకునేదాన్ని. పోటీ చాలా ఎక్కువగా ఉంది. కొంత మంది బాగా ఆడి గట్టి పోటీ ఇచ్చారు. ఓటమి, గెలుపు అనేది కాదు. హౌస్‌ లోపల ఉంటూ పోటీపడటం అనేదే పెద్ద విషయం. నేను టాప్‌2లో నిలవడం గొప్ప ఘనతగా భావిస్తున్నాను. మధ్యలోనే వెళ్లిపోతాననుకున్న నాకు ఇది గర్వించే విషయం. అందుకే నాకు నేను అభినందించుకుంటున్నా’ని హినా ఖాన్‌ అన్నారు. చివరివరకు పోరాడాలని బిగ్‌బాస్‌ షో ద్వారా నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎటువంటి విచారం లేదని, అయితే కొన్నిసార్లు తన మాటలను వక్రీకరించారని వెల్లడించారు. పోటీలో గెలుపోటములు సహజమని, ఎలా ఆడామన్నదే ముఖ్యమని హినా ఖాన్‌ వ్యాఖ్యానించారు.

19 మంది పోటీదారులతో 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు.

మరిన్ని వార్తలు