-

అమాయకత్వం ప్లస్‌ ఆత్మవిశ్వాసం.. అందుకే ఆ అవకాశం!

18 Nov, 2017 23:58 IST|Sakshi

రంగం సిద్ధమవుతోంది. ఓ బయోపిక్‌లో ఇలియానాను నటింపజేయడానికి బాలీవుడ్‌ దర్శకుడు శివమ్‌నాయర్‌ నేతృత్వంలో రంగం సిద్ధమవుతోంది. తాప్పీ ముఖ్య పాత్రలో వచ్చిన ‘నామ్‌ షబానా’ చిత్రానికి నాయర్‌నే దర్శకుడు. ఇప్పుడు ఉజ్మా అహ్మద్‌ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఉజ్మా అహ్మద్‌ ఎవరనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా చెబుతున్నాం. మలేసియాలో పరిచయమైన పాకిస్తాన్‌ పౌరుడు తాహీర్‌ అలీని ఆమె ఇష్టపడింది. అతన్ని కలిసేందుకు పాకిస్తాన్‌ వెళ్లింది. కానీ, తాహీర్‌కు ఇదివరకే వివాహం అవ్వడమే కాదు.

నలుగురు పిల్లలకు తండ్రి కూడా. అయినా మళ్లీ పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. నిజం తెలుసుకున్న ఉజ్మా అహ్మద్‌ ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని భారత హై కమీషన్‌ను సంప్రదించి తిరిగి ఇండియా చేరుకుంది. ఈ సంఘటనలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఉజ్మా జీవితంలో జరిగిన ఆ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘‘అవును.. ఇలియానాను కలిశాను. ఈ సినిమాకు తనే కరెక్ట్‌. అమాయకత్వం, ఆత్మవిశ్వాసం కలగలిసిన అమ్మాయి ఇలియానా.

ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు ఆమె ఎగై్జట్‌ అయ్యారు. ఉజ్మా అహ్మద్‌ను కలిశాం. స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేస్తున్నా. కంప్లీట్‌ అయిన తర్వాత ఇలియానాకు ఫుల్‌ స్టోరీ చెప్తా్త’’ అని పేర్కొన్నారు శివమ్‌నాయర్‌. 2012లో ‘బర్ఫీ’తో బీటౌన్‌ తలుపు తట్టిన ఇలియానా అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రైడ్‌’ సినిమాలో నటిస్తున్నారామె. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు