ధడక్‌ సెట్‌లో జాన్వీ

9 Mar, 2018 10:07 IST|Sakshi

సాక్షి, ముంబయి :  శ్రీదేవి హఠాన్మరణం తీవ్ర షాక్‌లో ముంచెత్తినా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ మనోనిబ్బరంతో తన తొలి చిత్రం ధడక్‌ సెట్స్‌లో అడుగుపెట్టారు. రెండు రోజుల కిందటే 21వ బర్త్‌డేను అనాధాశ్రమంలో నిరాడంబరంగా జరుపుకున్న జాన్వీ తల్లి విషాదాంతాన్ని దిగమింగుకుని షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. బాంద్రా కార్టర్‌ రోడ్‌లో సహ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి జాన్వీ షూటింగ్‌లో పాల్గొన్నారు. శ్రీదేవి అనూహ్య మరణంతో జాన్వీ చాలారోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్‌ తీసుకుంటారని భావించినా షెడ్యూల్‌ ప్రకారం మూవీ విడుదలకు సహకరించేందుకు ఆమె చిత్రీకరణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.

బాంద్రాలో రెండు రోజుల పాటు జాన్వీ, ఇషాన్‌లపై రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం వచ్చే వారం చిత్ర యూనిట్‌ పోస్ట్‌ ఇంటర్వెల్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు కోల్‌కతా పయనమవుతుంది. ఇప్పటివరకూ చిత్ర ఫస్ట్‌హాఫ్‌ను రాజస్ధాన్‌, ముంబయిలో షూట్‌ చేశారు. మూవీ షూటింగ్‌కు భారీ విరామం ఇచ్చామనే వార్తల్లో నిజం లేదని..ముంబయిలో తిరిగి షూటింగ్‌ ప్రారంభమైందని తదుపరి షెడ్యూల్‌ కోల్‌కతాలో ప్లాన్‌ చేశామని దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ చెప్పారు. మరాఠీ చిత్రం సైరత్‌కు రీమేక్‌గా ధడక్‌ రూపొందుతోంది.

మరిన్ని వార్తలు