దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

19 Dec, 2019 09:36 IST|Sakshi

సినిమా: అంతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి వారసురాలి దక్షిణాది సినీ పరిశ్రమ ఎంట్రీ షురూ అయినట్లేనా? ఈ ప్రశ్నకు అవుననే బదులే సినీ వర్గాల నుంచి వస్తోంది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్‌ బాలీవుడ్‌లో కథానాయకిగా పరిచయమై తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్‌ నాయకిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడక్కడ బిజీ హీరోయిన్‌. అయితే తన కూతురిని దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి చాలా ఆశ పడింది. కానీ జాన్వీకపూర్‌ నటించిన తొలి చిత్రాన్నే చూడకుండా కన్నుమూసింది. కాగా ఇప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని చాలా మంది బాలీవుడ్‌ బ్యూటీలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని బహుభాషా నటీమణులుగా చెలామణి అవుతున్నారు. జాన్వీకపూర్‌ కూడా పలు సందర్భాల్లో  దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక తనకు ఉందని వ్యక్తం చేసింది. విజయ్‌దేవరకొండకు జంటగా నటించాలన్న ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే అది ఇప్పుడు జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెలుగు, తమిళభాషల్లో ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విజయ్‌దేవరకొండ హీరోగా నటించనున్నారు. కాగా ఈ చిత్రంలో నటి జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో నటింపజేయడానికి పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లను సంప్రదించినా విజయ్‌దేవరకొండతో నటించడానికి నిరాకరించినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.  దీంతో తనకు హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిని నటుడు విజయ్‌దేవరకొండ, బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహర్‌కు అప్పగించినట్లు, ఆయన నటి జాన్వీకపూర్‌ నటించడానికి సమ్మతించేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఫైటర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి నటి జాన్వీకపూర్‌ భారీ పారితోషికాన్నే డిమాండ్‌ చేసినట్లు టాక్‌. ఎంతో తెలుసా? రూ. 13 కోట్లు అట. ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆమె డిమాండ్‌ చేసిన పారితోషికాన్ని చెల్లించడానికి చిత్ర వర్గాలు సమ్మతించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు