ఇంకా షాక్‌లోనే ఉన్నా!

4 Jan, 2019 04:27 IST|Sakshi
జాన్వీ కపూర్‌

కూతురిని సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి మురిసిపోవాలనుకున్నారు శ్రీదేవి. తనలానే కూతురు కూడా అంచలంచెలుగా పైకెళ్తుంటే పడిపోకుండా పక్కనుండి పట్టుకోవాలని ఆశపడ్డారు. కానీ కూతురి మొదటి చిత్రాన్ని (ధడక్‌) చూడకుండానే శ్రీదేవి చనిపోయారు. ‘తల్లి మరణం తనకింకా షాక్‌గానే ఉంది’ అంటున్నారు జాన్వీ కపూర్‌. ఈ విషయం గురించి ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి చాలామంది చాలాసార్లు అడిగారు. చాలాసార్లే చెప్పాను కూడా. కానీ అమ్మ మరణం నాకిప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఆ వార్తను ఎందుకో జీర్ణించుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు. ‘అమ్మ చనిపోయింది’ అనే వార్త విన్నప్పటినుంచి ఆ తర్వాత నాలుగు నెలల వరకూ జరిగిన సంఘటనలు ఏవీ నా మైండ్‌లో రిజిస్టర్‌ కాలేదు.

జ్ఞాపకాలన్నీ అమ్మ చుట్టూనే ఉండిపోయాయి’’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. అలాగే షోను తేలికపరచడం కోసం తన తల్లిదండ్రులు ‘చాలా డ్రమాటిక్‌’ అని మరో విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. ‘‘డేటింగ్‌ విషయాన్ని అమ్మా, నాన్న చాలా డ్రామా చేసేవారు. ‘నీకెవరైనా నచ్చితే మాతో వచ్చి చెప్పు. మేం నీకు పెళ్లి చేస్తాం’ అనేవారు. అప్పుడు నేనేమో ‘నచ్చిన ప్రతీ అబ్బా యిని పెళ్లి చేసుకోలేం కదా. జస్ట్‌ ఫ్రెండ్లీగా చిల్‌ కూడా అవ్వొచ్చు అనుకుంటా?’ అని సమాధానం చెప్పేదాన్ని. ‘చిల్‌ అవ్వడమంటే? ఏంటి?’ అని తిరిగి ప్రశ్నించేది అమ్మ. ఇలా సరదాగా జోక్‌ చేసుకునేవాళ్లం’’ అని పేర్కొన్నారు జాన్వీ. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రస్తుతం పైలెట్‌ గుంజన్‌ సక్సెనా బయోపిక్‌లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు