తాతల పాత్రల్లో మనవళ్లు?!

25 Sep, 2016 01:15 IST|Sakshi
తాతల పాత్రల్లో మనవళ్లు?!

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘క్లాసిక్’ అనదగ్గ సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన ఆ చిత్రాన్ని ఆ ఇద్దరి మనవళ్లు చిన్న ఎన్టీఆర్, నాగచైతన్యతో రీమేక్ చేస్తే బాగుంటుందని చాలామంది అంటుంటారు. ఈ హీరోలిద్దరూ ఆ చాన్స్ వస్తే నటించడానికి సుముఖంగానే ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ తాతల పాత్రల్లో కనిపించనున్నారని టాక్.
 
 శనివారం ఫిలిం నగర్‌లో ఇదే హాట్ టాపిక్. ‘ఎవడే సుబ్రమణ్యం’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన నాగ అశ్విన్ ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహా నటి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న నటుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ కూడా ఉన్నారు. ఆమె కథతో తీసే సినిమాలో ఈ పాత్రలు కూడా ఉంటాయి కాబట్టి, వీటిని ఆ మహా నటులిద్దరి మనవళ్లతో చేయించాలని నాగ అశ్విన్ భావిస్తున్నారట. ఎన్టీఆర్, నాగచైతన్యను సంప్రదించారని సమాచారం. సినిమాకి కీలకంగా నిలిచే ఈ ప్రత్యేక పాత్రలు చేయడానికి హీరోలిద్దరూ అంగీకరించారని భోగట్టా.