నీట్‌ అండ్‌ క్లీన్‌ మూవీ

1 Jun, 2018 05:59 IST|Sakshi
కె.ఎస్‌.రామారావు, కరుణాకరన్‌

 కె.ఎస్‌. రామారావు

‘‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో 35 సంవత్సరాల క్రితం నుంచి సినిమాలు తీస్తున్నా. మా సంస్థ నుంచి ఇప్పటివరకు 44 సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని డబ్బింగ్‌ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్న ‘తేజ్‌’ 45వ సినిమా. ఇంకా వైవిధ్యమైన మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని ఆరాట పడుతున్నా. నా చివరి శ్వాస వరకూ సినిమాలు తీస్తూనే ఉంటా’’ అని నిర్మాత కె.ఎస్‌. రామారావు అన్నారు. సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్‌’. ‘ఐ లవ్‌ యు’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్‌. రామారావు, వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.  ఈ సందర్భంగా కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, ఫ్యామిలీ డ్రామా ఇది.

డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్, సెన్సార్‌ కట్స్‌కి వీలు లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్‌ అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారని నా నమ్మకం. అలాంటి ఆయనతో ‘వాసు’ చిత్రం తర్వాత నేను రెండో సినిమా ‘తేజ్‌’ తీశా. ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా రేపు రిలీజ్‌ చేస్తున్నాం. 9న పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ బేనర్‌లో ఇంత మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్యూట్‌ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘తేజ్‌’ చిత్రం అందరికీ నచ్చుతుంది. తేజ్, అనుపమ సూపర్బ్‌గా చేశారు’’ అన్నారు కరుణాకరన్‌.
 

మరిన్ని వార్తలు