కమెడియన్‌ కునాల్‌పై ప్రయాణ నిషేధం

14 Mar, 2020 08:46 IST|Sakshi
కునాల్‌ కమ్రా (ఫైల్‌)

ముంబై: ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రాపై విమానయాన సంస్థ విస్తారా నిషేధం విధించింది. ఏప్రిల్‌ 27 వరకు కునాల్‌ తమ విమానాల్లో ప్రయాణించేందుకు వీల్లేదని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 28న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రైవేటు చానల్‌కు చెందిన న్యూస్‌ యాంకర్‌పై కునాల్‌ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడు. దీంతో కునాల్‌పై ఇండిగో సంస్థ ఆరు నెలల నిషేధం విధించింది. తర్వాత దానిని మూడు నెలలకు కుదించింది. ఆరోపణల విషయంపై విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని నియమించింది. కమిటీ విచారణలో కునాల్‌ ఆరోపణలు చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో మూడు నెలల నిషేధం విధించినట్లు ఎయిర్‌లైన్‌ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఇండిగో నిషేధం విధించిన తర్వాత ఎయిరిండియా, గోఎయిర్, స్పైస్‌ జెట్‌ సంస్థలు కూడా కునాల్‌పై నిషేధాజ్ఞలు విధించాయి.

విస్తారా నిషేధంపై కునాల్‌ కమ్రా ట్విటర్‌ స్పందించారు. ఈ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. విస్తారా విధించిన ప్రయాణ నిషేధంతో ఇబ్బందులు పడబోనని పేర్కొన్నారు. (చదవండి: కామ్రాను అనుమతించేది లేదు)

మరిన్ని వార్తలు