అధర్వ నుంచి లక్ష్మీరాయ్ అవుట్

8 Nov, 2013 04:17 IST|Sakshi
అధర్వ నుంచి లక్ష్మీరాయ్ అవుట్
సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు ఝలక్ ఇస్తుంటారు. అందుకు విరుద్ధంగా ఇరుంబు కుదిరై చిత్ర దర్శక నిర్మాతలు నటి లక్ష్మీరాయ్‌కు షాక్ ఇచ్చారు. పరదేశి చిత్రం తర్వాత యువ నటుడు అధ్వర్య నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ప్రియాఆనంద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బైక్ రేస్ క్రీడాకారిణిగా ముఖ్యపాత్రలో నటి లక్ష్మీరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది.
 
  ఈ చిత్రం కోసం ఆమె మోటార్ బైక్ డ్రైవింగ్‌లో శిక్షణ కూడా పొందారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తయింది. అధర్వ, ప్రియా ఆనంద్ మధ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయినా లక్ష్మీరాయ్‌కి చిత్ర యూనిట్ నుం చి షూటింగ్ కోసం పిలుపు రాలేదు. ఈ విషయమై యూనిట్ వర్గాలను విచారించగా ఆమె చిత్రంలో నటించడం లేదని తెలిపారు. ఈ సమాచారంతో లక్ష్మీరాయ్ షాక్‌కు గురయ్యారు. ఇరుంబు కుదిరై చిత్రం నుంచి తొలగించిన విషయం గురించి ఆమెకు ఎలాంటి సమాచారం లేదట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతోందట లక్ష్మీరాయ్.