సోషల్‌ మీడియాలో లైవ్‌ ఆడిషన్స్‌ 

11 Jun, 2020 00:32 IST|Sakshi

కొత్త వారికి నటీనటులుగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే డైరెక్టర్‌ తేజ మరోసారి తన తర్వాతి సినిమాకి ప్రతిభావంతులైన నటీనటులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం సోషల్‌ మీడియా వేదికగా ఆడిషన్స్‌ నిర్వహించనుండటం విశేషం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇలా లైవ్‌ ఆడిషన్స్‌ ప్లాన్‌ చేశారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌లో సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమా కాగా, మరొకటి గోపీచంద్‌తో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ చిత్రం. ఈ రెండు సినిమాల్లో దేని కోసం ఈ ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. కాగా హలో యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్‌ ఆడిషన్స్‌ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఆయా సినిమా యూనిట్స్‌ తక్కువ మందితో షూటింగ్‌ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక ఆడిషన్స్‌ కూడా ఇలా లైవ్‌లో జరుగుతున్నాయన్న మాట.

మరిన్ని వార్తలు