అందుకే ఎన్నికలకు వెళ్తున్నాం

6 Mar, 2019 03:33 IST|Sakshi
నరేశ్, రాజశేఖర్, జీవిత

– నరేశ్‌

‘‘శివాజీ రాజా కంటే నేనే సీనియర్‌. అయితే తన మనసులో మాటని అర్థం చేసుకోవడంతో పాటు ‘మా’ బాగుండాలనే ఉద్దేశంతో గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని శివాజీరాజాకి నేనే చెప్పా. అయితే గత ఏడాది వచ్చిన వివాదాలు, కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏకగ్రీవం కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం’’ అని నటుడు నరేశ్‌ అన్నారు. నరేశ్‌ అధ్యక్షుడిగా, రాజశేఖర్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్‌ ప్రధాన కార్యదర్శిగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్యానల్‌ మంగళవారం హైదరాబాద్‌లో తమ మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మా’ అన్నది ఒక ఆర్గనైజేషన్‌.

దీన్ని రాజకీయ పార్టీగానో, వ్యాపార సంస్థగానో నడపదలచుకోలేదు. సభ్యుల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలున్నప్పుడు ఎన్నికలు తప్పవు. మా ప్యానల్‌ విజయం సాధిస్తే పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేసి, ‘మా’ ప్రతిష్టను పెంపొందిస్తాం’’ అన్నారు. ‘‘మా’ కమిటీలోని వారందరితో పని చేయించే బాధ్యత నాది’’ అన్నారు రాజశేఖర్‌. ‘‘చిరంజీవిగారు ఓ ప్యానల్‌కి మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అందరూ మన కుటుంబ సభ్యులే.. ఏ ప్యానల్‌ విజయం సాధించినా మద్దతు ఇస్తాను’’ అని మేం కలిసినప్పుడు అన్నారు అని జీవితా రాజశేఖర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు