మరోసారి కాలర్‌ ఎగరేస్తున్నా

16 May, 2019 03:11 IST|Sakshi
మహేశ్‌బాబు

‘‘నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో, నా 25 సినిమాల జర్నీలో ఈ రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మహర్షి’. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రధారి. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజైంది. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో బుధవారం సాయంత్రం ప్రేక్షకులను కలిసింది ‘మహర్షి’ చిత్రబృందం. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘నా సూపర్‌ హిట్‌ సినిమాలు సుదర్శన్‌ థియేటర్‌లో రిలీజయ్యాయి.

నా 25వ చిత్రం ‘మహర్షి’ కూడా ఇక్కడ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు థ్యాంక్స్‌. ఈ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మీ అందరి కోసం మరోసారి (ఈ మధ్య జరిగిన ‘మహర్షి’ సక్సెస్‌మీట్‌లో కాలర్‌ ఎగరేశారు) కాలర్‌ ఎగరేస్తున్నాను’’ అన్నారు. ‘‘మహేశ్‌ 25వ సినిమా ‘మహర్షి’కి నేను దర్శకుడ్ని కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘‘ఈ నెల 18న విజయవాడలో సక్సెస్‌మీట్‌ నిర్వహిస్తాం’’ అన్నారు ‘దిల్‌ రాజు.

‘‘ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మహర్షి’ని చూసి ‘‘వ్యవ సాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం ఇది. మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, నిర్మాతలతోపాటు చిత్రబృందానికి అభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘మీ మాటలు మాకు స్ఫూర్తినిస్తున్నాయి. ధన్యవాదాలు సార్‌’’ అని బదులుగా మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు