చిరంజీవి కొత్త సినిమా షురూ

8 Oct, 2019 13:43 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన పూజా కార్యాక్రమాన్ని చిత్ర  సభ్యులు నిర్వహించారు. ఎలాంటి పెద్ద హడావుడి లేకుండా ఈ వేడుక జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌ కొట్టారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివతో పాటు అంజనీ దేవి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. కాగా సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.  
 
ఇక చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’  రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. సినిమా విడుదలై దాదాపు వారమైనా థియేటర్లలో ఇంకా అభిమానుల హడావుడి తగ్గలేదు. ఇప్పటికీ పలు థియేటర్ల ముందు హౌస్‌ ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే ‘సైరా’ ఏ రేంజ్‌లో హిట్‌ అయిందే అర్థం చేసుకోవచ్చు. కాగా, ఇంతటి భారీ విజయం అందుకున్న టాలీవుడ్‌ మెగాస్టార్‌ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఉగాదికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కొరటాల శివ రూపొందించినట్లు తెలుస్తోంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు