నిజమే మన ఆయుధం

10 Oct, 2018 00:46 IST|Sakshi

‘చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో’... వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఫ్లోరా షైనీ (ఆశా షైనీ) సుపరిచితురాలే. 2013లో వచ్చిన ‘సహస్ర’ చిత్రం తర్వాత ఆమె తెలుగులో సినిమాలేవీ చేయలేదు. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు, ఫొటోలు వైరల్‌గా మారడంతో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. పదేళ్ల కిందట తన మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్‌ దోషి (దీవార్, ఆంఖే తదితర చిత్రాల నిర్మాత) నన్ను దారుణంగా కొట్టాడు అంటూ ఆ ఘటన తాలూకు ఫొటోలను షేర్‌ చేసి, ఫ్లోరా తన ఆవేదన వ్యక్తం చేశారు.   ‘‘2007 ప్రేమికుల దినోత్సవం. అందరికీ సుపరిచితుడైన, నేనెంతగానో ప్రేమించిన నిర్మాత గౌరంగ్‌ దోషి అదే రోజు నన్ను దారుణంగా కొట్టాడు. ఏడాది పాటు నాకు నరకం చూపించాడు. అప్పుడు నా దవడ ఫ్రాక్చర్‌ అవడంతో పాటు ముఖంపై గాట్లు పడ్డాయి. ఆ సమయంలో నేను ఈ విషయాలు బయటపెట్టినా, ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో గౌరంగ్‌కు బాగా పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చాలాసార్లు బెదిరించాడు. అన్నట్లుగానే ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నన్ను తిరస్కరించేవారు.

సినిమాకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించిన రోజులూ ఉన్నాయి. ఆడిషన్స్‌కి పిలిచేవారు కూడా కాదు. నా ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని అనుకున్నాను. నేనే కాదు.. నాలాంటి ఎందరో మహిళలు గౌరంగ్‌ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిసినప్పుడు అతని వ్యవహారాన్ని నేను బయటపెట్టి మంచి పనే చేశా అనుకున్నా. నాకు అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు.. కనీసం అతను ఇలాంటివాడు అని చెప్పినందుకు ఆనందపడుతున్నా. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను. నిజాన్ని నమ్ముకోండి. దాన్ని ఆయుధంలా ధరించండి. మళ్లీ మనమంతా సంతోషంగా ఉందాం. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ఎవరూ ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్లు కాదు’’ అని వెల్లడించారు ఫ్లోరా షైనీ.  

మరిన్ని వార్తలు