మైఖేల్ జాక్సన్ కూతురిని ఏం అడిగాడంటే..

18 Jul, 2016 09:20 IST|Sakshi
మైఖేల్ జాక్సన్ కూతురిని ఏం అడిగాడంటే..

పాప్ ప్రపంచపు రారాజు మైఖేల్ జాక్సన్ మరణించి ఇప్పటికి ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనకు సంబంధించిన ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. తెల్లగా కనపడటం కోసం జాక్సన్ తరచు తన కూతురు పారిస్ను ముఖానికి బ్లీచింగ్ క్రీమ్ రాయమని అడిగేవాడట. ఈ విషయాన్ని అప్పట్లో జాక్సన్కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన కానార్డ్ ముర్రే రాసిన ‘దిస్ ఈజ్ ఇట్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో అన్నీ జాక్సన్ గురించిన విశేషాలే రాశారు. బ్లీచింగ్ క్రీమ్ రాయమని 18 ఏళ్ల కూతురు పారిస్నే ఎందుకు అడిగేవాడంటే, ఆమె తన కొడుకులు ప్రిన్స్ (19), బ్లాంకెట్ (14)ల కంటే తెల్లగా ఉంటుందని, అందువల్ల బ్లీచింగ్ క్రీమ్ ప్రభావం ఆమె శరీరం మీద అంతగా ఉండదని జాక్సన్ భావించేవాడట.

చాలాసార్లు తానే ఆ క్రీమ్ రాసేవాడినని, అయితే అలా రాసేటపుడు తప్పనిసరిగా గ్లోవ్స్ ధరించేవాడినని ముర్రే రాశారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే తన చర్మం పాడవుతుందని.. కొన్నిసార్లు పారిస్తో క్రీమ్ రాయించుకోవడంతో ఆమె విషయంలో ఆందోళన చెందేవాడినని చెప్పారు. తెల్లగా ఉందని ఆమెతో క్రీమ్ రాయించడం మంచిది కాదని, దానివల్ల ఆమె చర్మం కూడా ప్రభావితం అవుతుందని తాను చెప్పేవాడినని అన్నారు. మందులు అతిగా వాడటం వల్ల మైఖేల్ జాక్సన్ 2009లో మరణించిన విషయం తెలిసిందే.