ఒకటి ముగిసింది.. మరొకటి మొదలైంది.

29 Apr, 2018 01:10 IST|Sakshi
మోహన్‌లాల్‌

వయసు పెరుగుతున్నా సినిమాలు చేయడంలో మాలీవుడ్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ స్పీడ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా రెట్టింపు అవుతోంది. ఇలా ఒక సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వగానో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘మార్కర్‌–అరబీ కదాలింటే సింహం’. శనివారం ఈ సినిమాను ప్రకటించారు మోహన్‌లాల్‌. ‘‘ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఆంటోని పెరంబవూర్‌ నిర్మాణంలో రూపొందనున్న నా కొత్త సినిమాలో నటించనున్నాను’’ అన్నారు మోహన్‌లాల్‌. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ సంగతి ఇలా ఉంచితే.. వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్, మంజు వారియర్‌ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘ఒడియన్‌’ కంప్లీట్‌ అయ్యింది. ‘‘ఒడియన్‌’ షూటింగ్‌ను కంప్లీట్‌ చేశాం. 123 రోజుల ఈ సినిమా జర్నీలో సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు మోహన్‌లాల్‌. అంటే మోహన్‌లాల్‌ ఒక సినిమా పూర్తి చేయగానే మరో సినిమా మొదలుపెట్టేస్తారన్న మాట. మరోవైపు మోహన్‌లాల్‌ నటిస్తున్న మరో సినిమా ‘నీరళి’ మోషన్‌ పోస్టర్‌ను రీసెంట్‌గా రిలీజ్‌ చేశారు. అజయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతి నాయర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘నీరళి’ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు