ఐటీ మోసగాళ్ళు

28 Mar, 2020 00:35 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్‌–ఇండియన్‌ సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, నవదీప్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్‌ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నారు. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో చిత్రీకరణ నిలిచిపోయింది.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు, కై్లమ్యాక్స్, యాక్షన్‌ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన మా సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. యూనిట్‌ సభ్యుల క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశాం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక తిరిగి చిత్రీకరణ కొనసాగిస్తాం. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రపంచంలో కరోనా వైరస్‌ వల్ల ప్రభావితులైన వారు త్వరగా కోలుకోవాలి. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలి. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ క్వారంటైన్‌ ను పాటించాలి’’ అన్నారు.

మరిన్ని వార్తలు