బ్రేకప్‌ న్యూస్‌ను ప్రకటించిన ‘నాగిని’ నటి

1 Aug, 2018 15:39 IST|Sakshi
మోహిత్‌ రైనా, మౌనీ రాయ్‌ (పాత చిత్రం)

సీరియల్స్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం, ఆపై దాదాపు ఏడేళ్లపాటు వారి మధ్య ఉన్న రిలేషన్‌పై ఏనాడూ నోరు మెదపలేదు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, అనుమానించినా నవ్వుతూనే తప్పుకుంది ఆ జంట. అయితే తమ మధ్య అలాంటిదేం లేదని, కనీసం తాము స్నేహితులం కూడా కాదంటూ కుండబద్దలు కొట్టారు నటి మౌనీ రాయ్‌.

ముంబై : బుల్లితెరపై విజయవంతమై వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మౌనీ రాయ్‌. ఆమె తెరంగేట్రం చేయబోతున్న గోల్డ్‌ మూవీ ఈ నెల 15న విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి మౌనీ రాయ్‌, మోహిత్‌ రైనాల వ్యవహారం తెరపైకి వచ్చింది. 2018 ప్రారంభంలో మరికొన్ని రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలెక్కనుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ముంబై మిర్రర్‌తో మౌనీ మాట్లాడుతూ.. ‘చాలాకాలం నుంచి నేను ఒంటరిగా ఉంటున్నా. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను. మోహిత్‌, నేను కనీనం స్నేహితులం కాదని’పిడుగులాంటి వార్త పేల్చారు నటి. మరికొన్ని రోజుల్లో ఈ సినీ జంట పెళ్లి చేసుకోబోతుందని భావించిన వీరి అభిమానులకు ఇది నిజంగా చేదువార్త.

మౌనీ రాయ్‌తో రిలేషన్‌ వదంతులపై మోహిత్‌ రైనా సైతం స్పందించాడు. ‘మేమిద్దరం ఎక్కడ కలుసుకున్నా ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవాళ్లం. అంతేకానీ మా మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదు. ఒకరిపై మరొకరికి చాలా గౌరవం మాత్రం ఉందని’ మోహిత్‌ చెప్పుకొచ్చాడు. డేటింగ్‌ చేసిన సమయంలో మాత్రం.. మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం అంతా ఇష్టం ఉండదని, లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు నచ్చదని పలుమార్లు ప్రస్తావించాడు.

మరిన్ని వార్తలు