నా జీవితంలో మరుపురానిది తలైమురైగళ్

22 Aug, 2016 02:17 IST|Sakshi
నా జీవితంలో మరుపురానిది తలైమురైగళ్

నా జీవితంలో తలైమురైగళ్ చిత్రం మరపురానిదంటూ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్ వ్యాఖ్యానించారు.ఆయన తాజాగా తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం కిడారి. ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల నాయకిగా నటించారు. ఇతను ముఖ్య పాత్రల్లో నెపోలియన్, నటి సుజా నటించారు. తర్పుక శివ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి శనివారం సాయంత్రం స్థానిక ఆర్‌కేవీ.స్టూడియోలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత శశికుమార్ మాట్లాడుతూ కడారి చిత్ర కథ దర్శకుడు ప్రసాద్ మురుగేశ న్ చెప్పగానే తెగ నచ్చేసిందన్నారు.
 
  సాధారణంగా చిత్రాల కథలు హీరోనే సెంటర్ పాయింట్ చేసుకుని ఉంటాయన్నారు. అయితే ఈ కిడారిలో పలు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. అదే విధంగా కథ నచ్చగానే నటించాలనిపిస్తుందని, తనకీ కథ వినగానే దర్శకత్వం వహించాలన్న ఆశ కలిగిందని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటిలోకి తక్కువ కాలంలో అంటే 64 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసిన చిత్రం కిడారి అని తెలిపారు. ఆ క్రెడిడ్ దర్శకుడికే చెందుతుందన్నారు. దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఈ చిత్రాన్ని ఇంకా వేగంగా పూర్తి చేయాలని భావించారని.. తానే మరో రెండు రోజులు చేద్దామని అన్నానని చెప్పారు. ఇక నటి సుజాను చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలోనే చూసి ఉంటారని, అలాంటిది ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బాగా నటించారని తెలిపారు.
 
  అదే విధంగా నటి నిఖిల వెట్రివేలన్ చిత్రం తరువాత తనకు జంటగా రెండో సారి నటించిన చిత్రం కిడారి అన్నారు. తన చంబా అనే పాత్రలో చాలా చలాకీగా నటించారని తెలిపారు.ఇంతకు ముందు తనతో లక్ష్మీమీనన్, స్వాతి, అనన్న రెండేసి చిత్రాల్లో నటించారని, ఆ కోవలో నిఖిలా చేరారని అన్నారు. నిజానికి ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించామని..  అయితే పాత్రకు తగ్గ నటి లభించకపోవడంతో నిఖిలనే ఎంపిక చేసినట్లు వివరించారు. తన సంస్థలో రూపొందిస్తున్న ఎనిమిదో చిత్రం కిడారి అని పేర్కొన్నారు. అయితే బాలు మహేంద్ర దర్శకత్వంలో తలైమురైగళ్, బాలా దర్శకత్వంలో తారైతప్పట్టై చిత్రాలు తాను నిర్మించడం గర్వంగా ఉందన్నారు. తలైమురైగళ్ చిత్రం అయితే మరపురానిదని శశికుమార్ పేర్కొన్నారు.