అలకలు... బుజ్జగింపులు!

23 Nov, 2018 00:10 IST|Sakshi
నాగచైతన్య

సమంత, నాగచైతన్యల మధ్య మొదలైన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అందుకే శ్రీమతి అలకను తీర్చడానికి వైజాగ్‌లోని బడికి, గుడికి, రైల్వేస్టేషన్‌కి వెళ్లొచ్చారట నాగచైతన్య. అసలు గొడవ ఏంటీ? సమంతను బుజ్జగించేంత తప్పు నాగచైతన్య ఏం చేశారు? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ (వర్కింగ్‌ టైటి ల్‌)అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైజాగ్‌లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తయింది. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో చైతన్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే బడి, గుడికి సంబంధించిన సీన్స్‌ తీశారట. ఈ సీన్స్‌ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయట. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది.

ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిస్తారని సమాచారం. స్క్రిప్ట్‌ పరంగా తరచూ గొడవపడే భార్యాభర్తలుగా నటిస్తున్నారు చైతన్య, సమంత. గొడవలన్నీ సినిమా పాత్రలపరంగానే. రియల్‌ లైఫ్‌లో ఈ ఇద్దరూ హ్యాపీ కపుల్‌. అన్నట్లు.. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్‌ స్వరకర్త. అన్నట్లు... ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజా సినిమా లుక్‌ని రిలీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు